భారత్‌ను అమెరికా 200 ఏళ్ళు పాలించిందిట! మీకు తెలుసా?

అవును! భారత్‌ను అమెరికా 200 ఏళ్ళు పాలించిందిట! ఈవిషయం ఇంతకాలం భారతీయులు ఎవరికీ తెలియకపోవడం విచిత్రమే కదా?ఈవిషయం కనిపెట్టి చెప్పింది సాదాసీదా వ్యక్తి కాదు. ఇటీవల ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తీరత్ సింగ్‌ రావత్.

ఇంతకీ ఆయన ఏమన్నారంటే, “రవి అస్తమించని అమెరికా భారతీయులను బానిసలుగా చేసుకొని మన దేశాన్ని 200 ఏళ్ళు పాలించింది. కానీ ఇప్పుడేమో కరోనా మహమ్మారిని అదుపు చేయలేక సతమతమవుతోంది. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో భారత్‌లో కరోనాను విజయవంతంగా అదుపుచేయగలిగాము. ఒకవేళ ఇటువంటి పరిస్థితులలో నరేంద్రమోడీకి బదులు వేరెవరైనా దేశానికి ప్రధానమంత్రిగా ఉండి ఉంటే మన దేశం కూడా అతిపెద్ద సంక్షోభంలో చిక్కుకొని ఉండేది. కానీ మోడీ ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యలతో దేశం కరోనాను ధీటుగా నిలువరించగలుగుతోంది,” అని అన్నారు. 


ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి భారత్‌ను ఏ దేశం పరిపాలించిందో తెలియకపోవడం చాలా విడ్డూరం. తాజాగా ఆయన మహిళలు టోర్న్ జీన్ ప్యాంట్స్ ధరించడం సరికాదని చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. మరో విశేషమేమిటంటే ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కరోనా బారినపడ్డారు.