
మార్చి 14వ తేదీన జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతున్నప్పటికీ, అన్ని పార్టీలు తమ తమ అభ్యర్ధులను నిలబెడుతున్నాయి. ఈనెల 16 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలై 23వరకు సాగుతుంది. అయితే టిఆర్ఎస్ వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరును ఖరారు చేసింది తప్ప హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి పార్టీ అభ్యర్ధిని ఇంతవరకు ప్రకటించలేదు. నామినేషన్ దాఖలు చేసేందుకు ఇంకా 5 రోజులు మాత్రమే గడువు మిగిలి ఉన్నప్పటికీ, ఎటువంటి సంకేతాలు ఇవ్వకపోవడంతో ఆ స్థానం నుంచి టిఆర్ఎస్ పోటీ చేయకపోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ బిజెపి ఎమ్మెల్సీ రామచంద్రరావును ఢీకొని ఓడించడం కష్టమని కనుక వామపక్షాల మద్దతుతో బరిలోకి దిగిన ప్రొఫెసర్ నాగేశ్వర్కు పరోక్షంగా సహకరించడం మంచిదని టిఆర్ఎస్ భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవే నిజమైతే ఈ ఎన్నికలలో బిజెపి టిఆర్ఎస్ను కాక ప్రొఫెసర్ నాగేశ్వర్ను ఎదుర్కోవలసిరావచ్చు.
ఎన్నికల షెడ్యూల్:
ఫిబ్రవరి 16: నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ
ఫిబ్రవరి 23: నామినేషన్లు దాఖలుకు చివరి రోజు
ఫిబ్రవరి 24: నామినేషన్ల పరిశీలన
ఫిబ్రవరి 26: నామినేషన్ల ఉపసంహరణ
మార్చి 14: పోలింగ్ (ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు)
మార్చి 17: ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటన.