ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో చెరో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ మరియు వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈనెల 16న నోటిఫికేషన్‌ జారీ చేసి మార్చి 14న పోలింగ్ నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున నేటి నుంచే ఆ రెండు నియోజకవర్గాలలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. ఎన్నికల గంట మోగింది కనుక రాష్ట్రంలో మళ్ళీ రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. 

ఏపీలో తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలు మరియు కృష్ణ-గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాలలో ఇవే తేదీల ప్రకారం ఎన్నికలు జరుగనున్నాయి. 

ఎన్నికల షెడ్యూల్: 

ఫిబ్రవరి 16: నోటిఫికేషన్‌ జారీ, నామినేషన్ల స్వీకరణ

ఫిబ్రవరి 23: నామినేషన్లు దాఖలుకు చివరి రోజు 

ఫిబ్రవరి 24: నామినేషన్ల పరిశీలన

ఫిబ్రవరి 26: నామినేషన్ల ఉపసంహరణ

మార్చి 14: పోలింగ్ (ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు)

మార్చి 17: ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటన.