మహారాష్ట్రతో తెలంగాణ చారిత్రక జల ఒప్పందం

మహరాష్ట్రతో కేసీఆర్ సర్కార్ చారిత్రక ఒప్పందాలు చేసుకుంది. గోదావరి నదిపై టీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన అంతర్రాష్ట్ర బ్యారేజ్ ల నిర్మాణం కోసం రూపొందించిన ఎంవోయూపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతకం చేశారు. సహ్యాద్రి అతిథి గృహంలో జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, ఫడ్నవీస్ లతోపాటు మంత్రులు కూడా పాల్గొన్నారు. కాళేశ్వరం, ప్రాణహిత ప్రాజెక్టులతో పాటు అదిలాబాద్ సరిహద్దులో పెన్ గంగపై నిర్మించనున్న ప్రాజెక్టుకు కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి, గోదావరి కాళేశ్వరం ప్రాజెక్టుపై మేడిగడ్డ, దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న పెన్ గంగ పై ఛనాకా-కొరాట బ్యారేజీల నిర్మాణంకు ఇరు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. 

ఇందులో తమ్మిడిహట్టి, మేడిగడ్డలకు డీపీఆర్‌లు(పూర్తి ప్రాజెక్టు నివేదిక) పూర్తయ్యాయి. 1.85 టీఎంసీ తమ్మిడిహట్టి 148 మీటర్ల ఎత్తు , 16 టీఎంసీల సామర్థ్యంతో మేడిగడ్డ వంద మీటర్ల ఎత్తునకు ఒప్పందం కుదురింది. 0.85 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో చనాక-కొరాటకు సంబంధించి రెండు బ్యారేజీలకు డీపీఆర్‌లు ఇంకా పూర్తికాకపోగా, అందుకు అనుమతులు లభించాయి. అవి మినహా మిగిలిన వాటికి సమావేశం ఆమోద ముద్ర వేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద కరీంనగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో కొత్తగా 18.19 లక్షల ఎకరాలు, 18 లక్షల ఎకరాల స్థిరీకరణ. తమ్మిడిహట్టి తో ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్-కాగజ్ నగర్, ఆసిఫాబాద్, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలు. పెన్ గంగ ద్వారా ఆదిలాబాద్ జిల్లా తాంసి, జైనథ్, బేలా మండలాల్లో 50 వేల ఎకరాలు సస్యశామలం కానున్నాయి.

కాగా మేడిగడ్డ వద్ద నిర్మించే బ్యారేజీకి సంబంధించి వంద మీటర్ల ఎత్తుపై సాంకేతిక ఒప్పందం జరిగింది. అయితే మరో మీటరు ఎత్తును ఏడాదిలోపు పెంచేందుకు వెసులుబాటు ఇస్తూ ఇరు రాష్ర్టాలు ఇప్పటికే అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. ఆ మేరకు అధికారులు 101 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి సాంకేతిక డిజైన్లు తయారు చేశారు. ప్రస్తుతానికి గేట్లు వంద మీటర్ల ఎత్తులోనే పెడతారు. భవిష్యత్తులో మహారాష్ట్ర అంగీకరిస్తే మరో మీటరు పెంచుకునే వెసులుబాటు (కుషన్) ఉంచుతున్నారు. మొత్తానికి ఈ ప్రాజెక్టుల ఒప్పంద ఫలితంగా తెలంగాణలో 39 లక్షల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది.

ఇరు రాష్ట్రాల ఈ ఒప్పందం ఎంతో కీలకమని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మహారాష్ట్రతో ఇంతవరకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదని, భవిష్యత్తులో కూడా మంచి సంబంధాలను కొనసాగించాలనుకునే ఈ జల ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారు. పొరుగు రాష్ట్రంతో జల వివాదాలను సమస్యరించుకోవటం కోసం సామరస్య చర్చలు మార్గాలని కేసీఆర్ నిరూపించారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తెలిపారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.