గ్యాంగ్ స్టర్ నయీం సహా అనుచరులపై 12 కేసులు

గ్యాంగ్ స్టర్ నయీం కేసులో ఇప్పటివరకు 18మందిని అరెస్ట్ చేసినట్లు సిట్ ప్రత్యేక అధికారి నాగిరెడ్డి తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన గురువారం మీడియాకు వెల్లడించారు. సోదాల్లో రాష్ట్రవ్యాప్తంగా 599 ల్యాండ్ డాక్యుమెంట్లు, 19 ఆయుధాలు, 2 కిలోల బంగారం, 2.88 కోట్ల నగదు, 6కార్లు  స్వాధీనం చేసుకున్నట్లు నాగిరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 12 కేసులు నమోదు చేశామని,  వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేస్తామని, బాధితులెవరైనా ఉంటే తమను ఆశ్రయించవచ్చని ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో నయీంకు గల సంబంధాలపై డీజీపీని ఆదేశిస్తూ విచారణ చేస్తామన్నారు. అలాగే నయీం ఇంట్లో అదుపులోకి తీసుకున్న 9మంది చిన్నారులను బాలసదన్ కు తరలించినట్లు నాగిరెడ్డి చెప్పారు.

మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో ఎన్ కౌంటర్ జరిగిన ఇంటి నుంచి రెండు ఏకే-47 గన్ లు, స్టెన్ గన్, 4 రివాల్వర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 17 సెల్ ఫోన్లు, మారుతీ డిజైర్, హోండా అమేజ్, స్కూటీ ని సీజ్ చేశారు. రూ.3.74 లక్షల నగదు, ఐదున్నర తులాల బంగారం, వ్యవసాయ భూములకు సంబంధించిన 121 డాక్యుమెంట్లు స్వాధీన పరచుకున్నారు. అలాగే సంఘటనా స్థలంలో భువనగిరికి చెందిన సలీమాబేగం, మిర్యాలగూడకు చెందిన మతీన్ భార్య ఖలీమ, నయిముద్దీన్ భార్య హసీనాను పోలీసులు అరెస్ట్ చేశారు.

మరోవైపు తవ్విన కొద్దీ నయీం ఆగడాలు వెలుగులోకి వస్తున్నాయి. నల్లగొండ జిల్లావ్యాప్తంగా నయీం అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నయీం భూదందాలు, సెటిల్ మెంట్లపై ఆరా తీస్తున్నారు. భువనగిరి, బొమ్మలరామారంలో వందల ఎకరాలు గుర్తించారు. నయీం ఇంట్లో దొరికిన డాక్యుమెంట్ల ఆధారంగా విచారణ జరుపుతున్నారు. జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సిట్ లేఖలు రాసింది. నయీం, అతడి అనుచరుల రియల్ దందాలపై సిట్ చురుగ్గా దర్యాప్తు చేస్తోంది.