
సిఎం కేసీఆర్ దంపతులు సోమవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సిఎం కేసీఆర్ దంపతులు ఉదయం 8.30 గంటలకు ప్రగతి భవన్ నుంచి ప్రగతిరధం బస్సులో బయలుదేరి సిద్ధిపేట, రాజన్న సిరిసిల్లా మీదుగా వేములవాడ చేరుకొంటారు. అక్కడ పూజా కార్యక్రమాలు ముగించుకొన్న తరువాత మిడ్మానేరు ప్రాజెక్టు వద్దకు చేరుకొని జలహారతి ఇస్తారు. ప్రాజెక్టును పరిశీలించిన తరువాత తీగలగుట్టలోని తెలంగాణ భవన్ చేరుకొని అక్కడ భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకొంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు. సిఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ అవసరమైన ఏర్పాట్లన్నీ చేశారు. ఈసారి సిఎం కేసీఆర్తో పాటు మంత్రి కేటీఆర్ కూడా వేములవాడ ఆలయం, మిడ్మానేరు ప్రాజెక్టు పర్యటనలో పాల్గొంటుండటం విశేషం.