జూన్ 12 నుంచి ఏ‌పి అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, మండలి సమావేశాలకు షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 12 నుంచి శాసనసభ సమావేశ నిర్వహణకు గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదముద్ర వేయడంతో ఏపీ అసెంబ్లీ స్పీకర్ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మొదటిరోజు ఉదయం 11.05 గంటలకు లాంఛనంగా తొలి సమావేశం జరుగుతుంది. మరుసటిరోజున కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణస్వీకారం చేస్తారు. అనంతరం శాసనసభ స్పీకర్, డెప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకొంటారు. జూన్ 14న ఉభయసభల సభ్యులను ఉద్దేశ్యించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగిస్తారు. అనంతరం శాసనసభ, మండలి వ్యవహారాల కమిటీ సభ్యులు సమావేశమయ్యి అజెండాను షెడ్యూల్ ను ఖరారు చేస్తారు. ఆ ప్రకారం శాసనసభ, మండలి సమావేశాలు జరుగుతాయి. శాసనసభ తాత్కాలిక స్పీకరుగా విజయనగరం జిల్లాలోని బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు నియమితులయ్యే అవకాశం ఉంది.