హైకోర్టులో కొండాకు ఉపశమనం

ఎన్నికల సమయంలో ఒక కేసుకు సంబందించి నోటీసు ఇవ్వడానికి వెళ్ళిన ఎస్.ఐ.,హెడ్ కానిస్టేబుల్ ను గదిలో నిర్బందించి దూషించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న చేవెళ్ళ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్‌పై మంజూరు చేసింది. 

ఈ వ్యవహారంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసు విచారణకు వెళ్లినప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తారని భావించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి మొదట నాంపల్లి కోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ వేయగా దానిని కోర్టు తిరస్కరించింది. దాంతో ఆయన వెంటనే హైకోర్టులో మరో పిటిషన్‌ వేశారు. సోమవారం ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ముందస్తు బెయిల్‌పై మంజూరు చేసింది. బెయిల్‌పై కోసం రూ.25,000 చొప్పున ఇద్దరు వ్యక్తులతో పూచీకత్తు సమర్పించవలసిందిగా కోర్టు ఆదేశించింది. కేసు విచారణలో పోలీసులకు సహకరించవలసిందిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కోర్టు ఆదేశించింది.