
మొదటిదశ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల గడువు నిన్న మధ్యాహ్నం 3గంటలతో ముగిసింది. చివరి రోజున తెలంగాణ రాష్ట్రంలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు మాత్రమే ఉండగా 795 మంది నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్లో 245మంది నామినేషన్లు వేశారు. వారిలో అత్యధికులు రైతులే. అదేవిధంగా ఖమ్మం స్థానానికి 38మంది అభ్యర్ధులు నామినేషన్లు వేశారు. వారిలో ముగ్గురు ప్రధానపార్టీలకు చెందిన అభ్యర్ధులుకాగా మిగిలినవారిలో అత్యధికులు సుబాబుల్ రైతన్నలే. తమ పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించనందుకు రైతన్నలు తమ ఆగ్రహాన్ని ఈవిధంగా తెలియజేశారు. ఈనెల 28వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఆలోగా నిజామాబాద్లో 95 కంటే ఎక్కువ మంది అభ్యర్ధులు బరిలో మిగిలినట్లయితే బ్యాలెట్ పత్రాలను ముద్రించి వాటితో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ చెప్పారు. సికిందరాబాద్లో 67, నల్గొండలో 48, భువనగిరిలో 45, మల్కాజ్గిరిలో 43మంది నామినేషన్లు దాఖలవడం ఆసక్తికరంగా ఉంది. ఈసారి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడంలేదు.
రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా దాఖలైన నామినేషన్లు:
1. ఆదిలాబాద్: 21
2. పెద్దపల్లి: 35
3. కరీంనగర్: 26
4. నిజామాబాద్ :245
5. జహీరాబాద్: 22
6. మెదక్: 20
7. మల్కాజ్గిరి: 43
8. సికిందరాబాద్: 67
9. హైదరాబాద్: 32
10. చేవెళ్ళ: 32
11. మహబూబ్నగర్: 34
12. నాగర్ కర్నూల్: 32
13. నల్గొండ: 48
14. భువనగిరి: 45
15. వరంగల్: 29
16. మహబూబాబాద్: 26
17. ఖమ్మం: 38