పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడంపై టీఆర్ఎస్ సర్కారు దృష్టిసారించింది. పలు ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు సాగునీరందించేందుకు కృతనిశ్చయంతో ఉంది. ప్రత్యేకించి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఎప్పటికప్పుడు ప్రాజెక్టుల పురోగతిపై దృష్టిసారిస్తున్నారు. పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పనులు వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. ప్యాకేజీల వారిగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు.
ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ ల నుంచి కృష్ణా జలాలు ఏ క్షణానైనా జూరాలకు చేరుకునే అవకాశముందన్నారు మంత్రి హరీష్ రావు, కల్వకుర్తి, నెట్టంపాడు, బీమా, కోయిల్ సాగర్ నుంచి ఈ సీజన్ లో నీళ్లిచ్చి తీరాల్సిందేనన్నారు. పాలమూరు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు తమ ప్రభుత్వ టాప్ ప్రియార్టీ అని ఆయన స్పష్టంచేశారు. టార్గెట్ ప్రకారం పనులు పూర్తిచేయకపోతే 146 జీవో ప్రకారం 60 శాతం బిల్లుల చెల్లింపులను నిలిపివేస్తామని, ఎట్టిపరిస్థితుల్లోనూ అలక్ష్యాన్ని సహించేది లేదని మంత్రి హరీష్ రావు హెచ్చరించారు.