దిల్లీకి కేసీఆర్.. ఏం మాట్లాడతారు..?

తెలంగాణ సీఎం కేసీఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్‌… హస్తిన టూర్‌పై ప్రధానంగా గవర్నర్‌తో చర్చించినట్టు తెలుస్తోంది. దిల్లీలో శనివారం జరిగే ముఖ్యమంత్రుల సమావేశానికి కేసీఆర్‌ హాజరుకానున్నారు. ఇప్పటికే దేశంలో టాప్ సిఎంగా ర్యాంకు తెచ్చుకున్న తర్వాత మొదటిసారి దిల్లీకి వెళుతున్నారు. పైగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ సమావేశంలో కలుసుకోనుండడంతో ఈ మీటింగ్ పై అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

హైకోర్టు విభజనతోపాటు రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రమంత్రులతో కేసీఆర్‌ భేటీ అయ్యే అవకాశముంది. హైకోర్టు విభజన నుంచి నీటి పంపకాల వరకూ అన్నింటిపైనా దృష్టిపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇటీవల విజయవాడ వెళ్లిన గవర్నర్‌ నరసింహన్‌… రెండు రాష్ట్రాల మధ్య సమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చించినట్టు తెలుస్తోంది. దానిపైనా కూడా కేసీఆర్‌… గవర్నర్‌ మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది.