తెరాసలో మరో వికెట్ పడింది

తెరాసలో మరో వికెట్ పడింది. తెరాస ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఇటీవల తెరాసకు రాజీనామా చేసిన చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి కె.యాదవరెడ్డి అనుచరుడు. ఇవాళ్ళ మేడ్చల్ లో జరుగబోయే కాంగ్రెస్‌ బహిరంగసభలో సోనియా, రాహుల్ గాంధీ సమక్షంలో వారిరువురూ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. కనుక ముందుగానే కె.యాదవరెడ్డిపై తెరాస సస్పెన్షన్ వేటు వేసింది. 

ఈరోజు వారితో పాటు మరికొందరు తెరాస ముఖ్యనేతలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ గోప్యత పాటిస్తున్న కారణంగా వారి పేర్లు బయటకు రాలేదు. డిసెంబరు 7వ తేదీలోగా ముగ్గురు తెరాస ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు. వారిలో చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇప్పటికే బయటపడ్డారు. మరి మిగిలిన ఇద్దరు ఎంపీలు ఎవరో చూడాలి. 

ఇవాళ్ళ సాయంత్రం 5 గంటలకు మేడ్చల్ బహిరంగసభలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో పాటు టిజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్‌, తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ పాల్గొంటారని సమాచారం. ఈ నెలాఖరున రాహుల్ గాంధీ తెలంగాణలో నిర్వహించబోయే బహిరంగసభలలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారని సమాచారం.