కాంగ్రెస్ అభ్యర్ధుల మొదటి జాబితా ఖరారు

ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేయడానికి 1,000కి పైగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా వాటిని స్క్రీనింగ్ కమిటీ వడపోసి మొదటి జాబితాలో 34 మంది పేర్లను ఖరారు చేసింది. ఊహించినట్లుగానే వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డి, జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, షబ్బీర్ ఆలీ, పొన్నం ప్రభాకర్‌ వంటి ముఖ్యనేతల పేర్లున్నాయి. అంతేకాదు...వారి నియోజకవర్గాలు కూడా ఖరారు చేయడం విశేషం.

వారందరూ పోటీ చేయడం ఖాయమే అయినప్పటికీ మహాకూటమిలో సీట్ల సర్దుబాట్లపై ఇంకా చర్చలు కొనసాగుతుండగానే కాంగ్రెస్ అభ్యర్ధుల పేర్లు వారి నియోజకవర్గాలను ప్రకటించడం చూస్తే సీట్ల సర్దుబాట్లపై తమ వైఖరిలో ఎటువంటి మార్పు లేదని, తమకు బలమైన అభ్యర్ధులున్న స్థానాలను మిత్రపక్షలకు వాదులుకోవడానికి సిద్దంగాలేమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసినట్లయింది.

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ఎలాగూ మహాకూటమికి 48 గంటలు డెడ్-లైన్ విధించారు కనుక ఆలోగా సీట్లసర్దుబాట్లపై చర్చలు ముగించక తప్పదు కనుక కాంగ్రెస్ పార్టీ ముందుగానే తన అభ్యర్ధుల మొదటిజాబితాతో మిత్రపక్షాలతో చర్చలకు వెళ్ళబోతోంది. ఒకవేళ కాంగ్రెస్ జాబితాపై మిత్రపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేయకపోతే ఏ సమస్య ఉండదు కానీ ఆ స్థానాల కోసం మిత్రపక్షాలు పట్టుబడితే ప్రతిష్టంభన తప్పదు. ఆ కారణంగా మహాకూటమి ప్రారంభం కాకమునుపే విచ్చిన్నం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

మహా కూటమిలో సీట్ల సర్దుబాట్లపై చర్చలు ముగిస్తే, కాంగ్రెస్ అభ్యర్ధుల తొలి జాబితాకు కాంగ్రెస్ అధిష్టానం చేత ఆమోదముద్ర వేయించుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. 

స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేసిన అభ్యర్ధుల జాబితా:  

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  (హుజూర్‌నగర్‌) 

జానారెడ్డి (నాగార్జునసాగర్‌)

భట్టి విక్రమార్క – మధిర) 

రేవంత్‌రెడ్డి (కొడంగల్‌)

కొండా సురేఖ (పరకాల)

షబ్బీర్‌ అలీ (కామారెడ్డి)

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (నల్గొండ)

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (మునుగోడు)

జీవన్‌రెడ్డి (జగిత్యాల)

దామోదర రాజనర్సింహ (ఆందోల్‌)

సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం)

గీతారెడ్డి (జహీరాబాద్‌)

డీకే అరుణ (గద్వాల)

పొన్నం ప్రభాకర్‌ (కరీంనగర్‌)

సునీతాలక్ష్మారెడ్డి (నర్సాపూర్‌)

పొన్నాల లక్ష్మయ్య (జనగామ)

గండ్ర వెంకటరమణరెడ్డి (భూపాలపల్లి)

శ్రీధర్‌బాబు (మంథని)

జగ్గారెడ్డి (సంగారెడ్డి)

బలరాంనాయక్‌ (మహబూబాబాద్‌)

ఉత్తమ్‌ పద్మావతి (కోదాడ)

రమేష్‌ రాథోడ్‌ (ఖానాపూర్‌)

సంపత్‌ (ఆలంపూర్‌)

మహేశ్వర్‌రెడ్డి (నిర్మల్‌)

దొంతుమాధవరెడ్డి (నర్సంపేట)

కూన శ్రీశైలంగౌడ్ (కుత్బుల్లాపూర్‌)

చిన్నారెడ్డి (వనపర్తి)

కార్తీక్‌రెడ్డి  (రాజేంద్రనగర్‌)

సుధీర్‌రెడ్డి (ఎల్బీనగర్‌)

ప్రతాప్‌రెడ్డి (షాద్‌నగర్‌)

సుదర్శన్‌రెడ్డి (బోదన్‌)

సురేష్‌ షెట్కర్‌ (నారాయణ్‌ఖేడ్‌)

వంశీచందర్‌రెడ్డి (కల్వకుర్తి)

ఆరేపల్లి మోహన్‌ (మానకొండూరు)