తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన ఉమ్మడి హైకోర్టు విభజనపై ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఆసక్తికర కామెంట్ చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి అన్యాయం చేస్తున్నారని, ఆంధ్రా ప్రాంతానికి చెందిన వాళ్లకు ఇక్కడ పోస్టింగ్ లు ఇస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా కోర్టులకు సామూహిక సెలవు పెట్టి మరీ ఆందోళన చేశారు న్యాయాధికారులు. దాంతో తెలంగాణ సర్కార్ కూడా దీన్ని సీరియస్ గా తీసుకొని కేంద్రానికి వెంటనే లేఖ రాసింది. కాగా తాజాగా గవర్నర్ హైకోర్టు విభజనపై చేసిన వ్యాఖ్యలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగించాయి.
కేంద్రం ఆదేశాలతో సమస్య పరిష్కారం కోసం రంగంలోకి దిగిన ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో భేటీ కోసం ఏకంగా విజయవాడ పయనమయ్యారు. ఇక రెండు రోజుల పాటు అక్కడే ఉన్న నరసింహన్, చంద్రబాబుతో చర్చలు జరిపారు.. దీంతో అందరూ ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని అనుకున్నారు.. అయితే నిన్న సాయంత్రానికల్లా తిరుమల చేరుకున్న ఆయన, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును దేవుడే చూసుకుంటాడంటూ భారం ఏడు కొండలవాడిపై వేశారు.