కరోనా వైరస్ ఒమిక్రాన్ రూపంలో ప్రపంచదేశాలపై విరుచుకు పడుతుండటంతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. నేటి నుంచి రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చినప్పుడు విధిగా మాస్క్ ధరించాలని లేకుంటే పోలీసులు రూ.1,000 జరిమానా విధిస్తారని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ వైరస్ వ్యాపించకుండా ప్రజలందరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని, రెండు డోసులు కరోనా వాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. ఒకవేళ రాష్ట్రంలో ఒమిక్రాన్ ప్రవేశించినా దానిని ఎదుర్కొనేందుకు సర్వ సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ మళ్ళీ జాగ్రత్తలు పాటించకపోతే ఒమిక్రాన్ వైరస్ రాష్ట్రంలో ఎప్పుడైనా ప్రవేశించవచ్చని డాక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు.