ఆర్ధికమంత్రి హరీష్రావు అధ్యక్షతన శుక్రవారం తాత్కాలిక సచివాలయం బీఆర్కె భవన్లో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. దీనిలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొన్నారు. ఈ సమావేశంలో సబ్-కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రులు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, ప్రజారోగ్య శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలు:
• రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రులలో మౌలికవసతులు, పరిశుభ్రతను పెంచాలి. ముఖ్యంగా టాయిలెట్లను ఎప్పటికప్పుడు శుభ్రపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.
• సమయానికి ఆసుపత్రులకు రాని వైద్యులపై కటిన చర్యలు తీసుకోవాలి. బయోమెట్రిక్ విధానాన్ని అమలుచేయాలి.
• రాష్ట్రంలోని గ్రామాలలో, మారుమూల ప్రాంతాలలో ప్రజల ఆరోగ్య పరిస్థితిని, వారికి అందిస్తున్న వైద్యసేవలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలి. ఇందుకోసం వారికి వైద్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలకు ట్యాబ్స్ ఇవ్వాలి.
• వైద్య శాఖలోని కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఇక నుంచి ప్రతీ నెల 1వ తేదీనే వేతనాలు చెల్లించాలి.
• ఆసుపత్రులలో వైద్య సిబ్బందిని అవసరాలకు తగినట్లు సర్దుబాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలి.
• వైద్య పరికరాల మరమత్తులు, నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలి.
• ఆసుపత్రులను అవసరం ఉన్నచోటకు తరలించాలి.
• గర్భవతులకు అనవసరంగా సిజేరియన్ ఆపరేషన్లు చేయకుండా చర్యలు చేపట్టాలి.
• వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తమిళనాడు, కేరళ రాష్ట్రాలలోని పర్యటించి అక్కడి ప్రభుత్వాసుపత్రులలో అనుసరిస్తున్న వైద్య విధానాలను అధ్యయనం చేయాలి. వాటితో పోల్చుకొని తెలంగాణ వైద్య విధానాన్ని మరింత మెరుగుపరుచుకోవాలి.
• రాష్ట్రంలో ములుగు, రాజన్న సిరిసిల్లా జిల్లాలలో పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్న సమగ్ర ఆరోగ్య సర్వేను తక్షణమే ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి.