దేశంలో నానాటికీ కరోనా కేసులు పెరిగిపోతున్నందున తక్షణమే లాక్డౌన్ విధించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం నిన్న కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. లాక్డౌన్ విధించడం వలన దేశంలో కోట్లాదిమంది పేద, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు కనుక ఈసారి వారి కోసం ముందుగా అన్ని ఏర్పాట్లు చేసి లాక్డౌన్ విధిస్తే మంచిదని జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ రవీంద్ర భట్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. ఈ సందర్భంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు అనేక సూచనలు కూడా చేసింది.
• ఆక్సిజన్ నిలువలు ఉంచుకోవాలి. ఆక్సిజన్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఢిల్లీలోని ఆసుపత్రులకు అత్యవసరంగా, నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా జరిగేలా కేంద్రప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలి.
• వాక్సిన్లు, మందుల పంపిణీపై కేంద్రప్రభుత్వ విధానాలను పునః సమీక్షించుకొని ఏవైనా లోపాలున్నట్లయితే సరిదిద్దుకొని మెరుగుపరుచుకోవాలి.
• ఈ క్లిష్ట సమయంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది ఆరోగ్యాలు కాపాడటం కూడా చాలా ముఖ్యం. కనుక వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలి. వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. కరోనాతో మరణించినవారి ఇన్స్యూరెన్స్ క్లెయిమ్స్ వెంటనే పరిష్కరించాలి.
• సామాజిక మాధ్యమాల ద్వారా తమ గోడు మొరపెట్టుకొంటున్న కరోనా రోగులను లేదా వారి బందుమిత్రులను కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వేధిస్తే సుప్రీంకోర్టు సహించదు.
• కరోనా రోగులను ఆసుపత్రులలో చేర్చుకొనే జాతీయ విధివిధానాలను రెండువారాలలోగా ప్రకటించాలి. వాటినే అన్ని రాష్ట్రాలు పాటించాలి.
• సభలు, సమావేశాలు, సామూహిక ప్రార్ధనలు, ఉత్సవాలను అనుమతించరాదు.
• దేశవ్యాప్తంగా అందరూ కరోనా జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించేలా చేయాలి.