టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం ఈరోజు హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, “ఇక నుంచి జాబ్ క్యాలండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతుంది. దాని ప్రకారం మే 1నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తాము.
కనుక వివిద శాఖలలో ఖాళీల వివరాలు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ వ్రాశాము. ఆ వివరాలు చేతికి రాగానే ఏప్రిల్ నుంచి అవసరమైన ప్రక్రియ పూర్తి చేసి మే 1న తొలి నోటిఫికేషన్ విడుదల చేస్తాము. ఈసారి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత 6-8 నెలల్లోపుగా భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తాము,” అని చెప్పారు.
ఈరోజు టీజీపీఎస్సీ గ్రూప్-3 ప్రిలిమినరీ కీ విడుదల చేసింది. గ్రూప్-3లో మొత్తం 1,365 పోస్టులు ఖాళీలు ఉండగా వాటి కోసం గత ఏడాది నవంబర్ 17,18 తేదీలలో పరీక్షలు నిర్వహించింది. మొత్తం 5.36 లక్షల మండి దరఖాస్తు చేసుకోగా పరీక్షలకు 2.70 లక్షల మంది మాత్రమే హాజరయ్యారు.
ఆ పరీక్షలకు సంబందించి ప్రిలిమనరీ కీ నేడు విడుదల చేసింది. దానిపై ఈ నెల 12 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు తెలుపవచ్చు. కానీ ఇంగ్లీషులోనే తెలపాలని టీజీపీఎస్సీ సూచించింది. ఈమెయిల్ ద్వారా లేదా వ్యక్తిగతంగా టీజీపీఎస్సీ కార్యాలయానికి వచ్చి ఇచ్చే అభ్యంతరాలు స్వీకరించబోమని తెలిపింది. అభ్యంతరాలను ఆన్లైన్లో తెలిపి, వాటికి సంబందించిన కాపీలను కూడా ఆన్లైన్లో సమర్పించాలని టీజీపీఎస్సీ సూచించింది.