టౌన్ ప్లానింగ్, వెటర్ననరీ శాఖలలో పోస్టుల భర్తీ కోసం టిఎస్పీఎస్సీ రూపొందించిన ప్రశ్నాపత్రాలు లీక్ కేసుపై దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైమ్ పోలీసులు టిఎస్పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్, రేణుక అనే మహిళను, ఆమె భర్త, ఆమె సోదరుడుతో సహా మొత్తం 20 మందిని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు.
టిఎస్పీఎస్సీ కంప్యూటర్స్ హ్యాక్ చేసి దానిలో భద్రపరిచిన ప్రశ్నాపత్రాలను దొంగిలించారని మొదట భావించినప్పటికీ, హ్యాకింగ్ జరుగలేదని పోలీసులు గుర్తించారు. టిఎస్పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్ ఓ యువతి వలలో చిక్కుకొని పేపర్ లీక్ చేసిన్నట్లు కనుగొన్నారు. గత కొంతకాలంగా ఆమె టిఎస్పీఎస్సీకి తరచూ వస్తూ ప్రవీణ్తో స్నేహం పెంచుకొని మెల్లగా అతనిని ఒప్పించి ప్రశ్నాపత్రం తీసుకొందని పోలీసులు గుర్తించారు. అయినప్పటికీ అనుమానితులందరినీ అదుపులో తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
ప్రశ్నాపత్రం లీక్ అవడంతో ఆదివారం జరుగాల్సిన టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీర్ రాత పరీక్షను, ఈ నెల 15,16వ తేదీలలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రాత పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు టిఎస్పీఎస్సీ శనివారం రాత్రి ప్రకటించింది. త్వరలోనే మళ్ళీ పరీక్షల తేదీలను ప్రకటిస్తామని టిఎస్పీఎస్సీ తెలియజేసింది.