బాసర ట్రిపుల్ ఐటి సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి విద్యార్థులు మళ్ళీ యూనివర్సిటీ ఆవరణలో కూర్చొని నిరసనలు తెలుపుతూ ఆందోళన ప్రారంభించారు. ఈసారి వారికి వారి తల్లితండ్రులు కూడా బాసటగా నిలిచారు. హైదరాబాద్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసం ముందు విద్యార్థుల తల్లితండ్రులు ఆదివారం ధర్నా చేశారు. బాసర ట్రిపుల్ ఐటిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి స్వయంగా హామీ ఇచ్చి రెండు నెలలు గడుస్తున్నా అరకొర పనులు చేసి సరిపెట్టారని వారు ఆరోపించారు. మంత్రి ఇంటి ముందు ధర్నా చేస్తున్న విద్యార్థుల తల్లితండ్రులను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఆదివారం రాత్రి ట్రిపుల్ ఐటి డైరెక్టర్ సతీష్ విద్యార్దులతో చర్చలు జరిపి అన్ని సమస్యలను తప్పక పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ లిఖితపూర్వకంగా హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని విద్యార్థులు చెప్పడంతో చర్చలు విఫలమయ్యాయి. సమస్యల గురించి అడిగినా, నిరసనలు తెలిపినా సస్పెండ్ చేస్తామని ట్రిపుల్ ఐటి ఇన్ఛార్జి వీసి వెంకటరమణ బెదిరిస్తున్నారని విద్యార్థులు, తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు.
ఇన్ఛార్జి వీసి వెంకటరమణ ఆందోళన విరమించాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. ఇదివరకు విద్యార్థులు ఆందోళనలు చేసినప్పుడు మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా వచ్చి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకొని రూ.20 కోట్లు మంజూరు చేశారని వాటితో పనులు చేయిస్తున్నామని చెప్పారు. అయినా కొందరు విద్యార్థులు కావాలనే మిగిలినవారిని రెచ్చగొడుతూ ట్రిపుల్ ఐటి ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారని ఇన్ఛార్జి వీసి వెంకటరమణ ఆరోపించారు. ట్రిపుల్ ఐటి ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఈసారి సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.
ఆదివారం మధ్యాహ్నం నుంచి బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈసారి ఎన్నిరోజులు సాగుతాయో, ఏవిదంగా ముగుస్తాయో చూడాలి.