ఇంటర్ కనీస విద్యార్హతతో లభించే ఉద్యోగాలు గ్రూప్-4లో ఎక్కువగా ఉంటాయి. గ్రూప్-4లో 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వమే చెప్పింది. పైగా ఈసారి కొత్త జిల్లాలు, కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే నియామకాలు జరుగుతాయి. ఈ పరీక్షలలో ఉత్తీర్ణులైతే ఎంచక్కా సొంత జిల్లాలలోనే ఉద్యోగాలు చేసుకోవచ్చు. కనుక ఈసారి వీటికి మరింత పోటీ ఉంటుంది. గ్రూప్-4కి సుమారు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకొంటారని టిఎస్పీఎస్సీ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇన్ని సానుకూలతలు ఉన్నందునే వీటి నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారంఅన్ని సవ్యంగా జరిగితే ఈ నెలాఖరులోగా గ్రూప్-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
ఇప్పటికే వీటి భర్తీకి ఆర్ధికశాఖ అనుమతించింది. కనుక వివిద శాఖాధిపతులు తమ శాఖలలో ఖాళీల సంఖ్య, అభ్యర్ధుల అర్హతలు, రిజర్వేషన్లు, వయో పరిమితి తదితర అంశాలతో టిఎస్పీఎస్సీకి కొటేషన్స్ పంపిస్తున్నారు. వాటిని టిఎస్పీఎస్సీ పరిశీలించి తదనుగుణంగా నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తవడానికి మరో రెండు, మూడు వారాలు పట్టవచ్చని తెలుస్తోంది. కనుక ఈ నెలాఖరులోగా గ్రూప్-4 నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది.
గ్రూప్-2,3 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనేవారు ఈ గ్రూప్-4 ఉద్యోగాలకు కూడా దరఖాస్తు చేసుకొంటుంటారు. కనుక అటువంటివారికి ఇబ్బంది లేకుండా గ్రూప్-1,2,3,4 పరీక్షల మద్య తగినంత విరామం ఉండేలా పరీక్షల షెడ్యూల్ తయారు చేస్తున్నారు.