వచ్చే ఏడాది మార్చి 23 నుంచి ఏప్రిల్ 12వరకు జరుగవలసిన ఇంటర్ వార్షిక పరీక్షలను కనీసం నెలరోజులు వాయిదా వేయాలని ఇంటర్ బోర్డు అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది తరగతులు కాస్త ఆలస్యంగా మొదలవడంతో సిలబస్ పూర్తయ్యేందుకు మరికొంత సమయం అవసరమనే ఉపాధ్యాయులు సూచనలను పరిగణనలోకి తీసుకొని, వార్షిక పరీక్షలను ఏప్రిల్-మే నెలల్లో నిర్వహించాలని భావిస్తున్నారు. తద్వారా సిలబస్ పూర్తయిన తరువాత విద్యార్దులకు పరీక్షలకు సిద్దమయ్యేందుకు తగినంత సమయం ఉంటుంది. ఇంటర్ బోర్డ్ అధికారులు వార్షిక పరీక్షల వాయిదా ప్రతిపాదనను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఆమె అనుమతి కోరనున్నారు. త్వరలోనే దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.