ఈ నెల 25 నుంచి జరుగనున్న తెలంగాణ ఇంటర్ ప్రధమ సంవత్సరం పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ విద్యార్దుల తల్లితండ్రుల సంఘం హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై ఈరోజు విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇలా చివరి నిమిషం పిటిషన్ వేసి పరీక్షలు రద్దు చేయమని కోరడం సమంజసం కాదని కనుక ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. హైకోర్టు సూచన మేరకు విద్యార్దుల తల్లితండ్రుల సంఘం తమ పిటిషన్ను ఉపసంహరించుకొంది. కనుక ఈ నెల 25 నుంచి ఇంటర్ పరీక్షలు యధాతధంగా జరుగనున్నాయి.
గత ఏడాది కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఇంటర్ ప్రధమ విద్యార్దులందరినీ ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి ప్రభుత్వం ప్రమోట్ చేసింది. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఆ పరీక్షలను నిర్వహించబోతోంది. విద్యార్దుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ప్రభుత్వం తెలిపింది. విద్యార్దులు, వారి తల్లితండ్రులు పరీక్షల నిర్వహణకు సహకరించవలసిందిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్దులకు కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొన్నామని ఇంటర్ బోర్డ్ తెలిపింది.