నేటి నుంచి తెలంగాణలో ప్రాధమిక తరగతులను బోధించే ఉపాద్యాయులు కూడా రోజూ విధులకు హాజరుకావలసి ఉంటుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తరువాత గత ఏడాది ఆగస్ట్ నుంచి ఉపాధ్యాయులు అందరూ రోజు విడిచి రోజు పాఠశాలలకు హాజరవుతున్నారు. గత నెల 1వ తేదీ నుంచి రాష్ట్రంలో 9,10 తరగతులు ప్రారంభం కాగా, 24 నుంచి 6,7,8 తరగతుల విద్యార్దులు పాఠశాలలకు వస్తున్నారు. కానీ ఇంకా ప్రాధమిక తరగతులు ప్రారంభం కానందున ఆ ఉపాధ్యాయులు మాత్రం రోజు విడిచి రోజు విధులకు హాజరవుతున్నారు. ఇప్పుడు 6 నుంచి 10 వ తరగతి వరకు విద్యార్దులందరూ పాఠశాలలకు వస్తున్నందున ప్రాధమిక తరగతులు బోధించే ఉపాధ్యాయుల సేవలను కూడా ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యంతో నేటి నుంచి వారు కూడా ప్రతీరోజు విధులకు హాజరుకావాలని ఆదేశించారు. కానీ రాష్ట్రంలో నేటికీ ఇంకా కరోనా కేసులు బయటపడుతూనే ఉన్నందున బహుశః వేసవి శలవుల తరువాతే ప్రాధమిక పాఠశాల విద్యార్దులకు తరగతులు ప్రారంభించే అవకాశం ఉంది.