సింగరేణి సంస్థ గత నెలలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వాటికి దరఖాస్తులను కూడా స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 8వ తేదీన అగ్రవర్ణ కులాల వారికి 10% రిజర్వేషన్ (ఈడబ్ల్యూఎస్)కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజా ఉత్తర్వుల నేపధ్యంలో ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్ కల్పిస్తూ కొత్తగా నోటిఫికేషన్ జారీ చేస్తుందా లేక వచ్చిన దరఖాస్తులలో దీనికి అర్హులైన అభ్యర్ధులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తింపజేచేస్తుందా?అనే విషయం ఇంకా తెలియవలసి ఉంది.
సింగరేణి ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్న అభ్యర్ధులకు ఈడబ్ల్యూఎస్ వర్తింపజేయాలని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సింగరేణిలో 879 ఉద్యోగాలను కార్మికుల పిల్లలకి ఇవ్వనున్నారు. వాటిలో కూడా ఈడబ్ల్యూఎస్ వర్తింపజేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి కాక మరో 372 ఉద్యోగాల భర్తీకి సింగరేణి నోటిఫికేషన్ విడుదల చేసింది.