పెట్టుబడుల వేటకు తన బృందంతో కలిసి జపాన్ పర్యటనకు వెళ్ళిన సిఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి సాధించారు. జపాన్ సంస్థలు ఎన్టీటీ డేటా, నెయిసా నెట్వర్క్స్ రూ.10,500 పెట్టుబడితో హైదరాబాద్లో ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాయి. శుక్రవారం టోక్యోలో సిఎం రేవంత్ రెడ్డి బృందం ఆ రెండు కంపెనీల ప్రతినిధులు సమావేశమై అన్ని అంశాలపై లోతుగా చర్చించిన తర్వాత ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఈ రెండు కంపెనీలు ఏఐ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పనిచేసే25,000 జీపీయులతో 400 మెగావాట్స్ సామర్ధ్యం కలిగిన డేటా క్లస్టర్ సెంటర్ హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నాయి. వీటి నిర్వహణ కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహిస్తారు. ఈ అత్యాధునిక డేటా క్లస్టర్ సెంటర్ సేవలు తెలంగాణలో సాంకేతిక, ఇంజనీరింగ్ విద్యా రంగంలో, డిజిటల్ గవర్నెన్స్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పర్యావరణం తదితర రంగాలలో వినియోగిస్తారు.
జపాన్కు చెందిన మరో ప్రముఖ సంస్థ తోషిబా కూడా తెలంగాణలో రూ.562 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధులతో టోక్యోలో శుక్రవారం ఒప్పందం చేసుకుంది. తోషిబా అనుబంధ సంస్థ తోషిబా ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ (టీటీడీఐ)కి ఇప్పటికే రుద్రారం ట్రాన్స్ఫారంలు వగైరా తయారు చేసే రెండు ప్లాంట్స్ ఉన్నాయి. వాటిని ఆధునీకరించడంతో పాటు కొత్తగా మరో ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. విద్యుత్ సరఫరాలో వినియోగించే ‘సర్జ్ అరెస్టర్స్’ ఈ ప్లాంట్లో తయారు చేస్తారు.