టిజిఎస్ఆర్టీసీ కార్గో సర్వీసులు చాలా కాలం క్రితమే ప్రారంభం అయ్యాయి. వాటితో అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లాలకు వివిద రకాల సరుకులు రవాణా చేస్తోంది. ఇప్పుడు టిజిఎస్ఆర్టీసీ హైదరాబాద్లో డోర్ డెలివరీ సర్వీసులు నేటి నుంచి ప్రారంభిస్తోంది. దీనిని పైలట్ ప్రాజెక్ట్ గా అమలుచేసి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలు అందించబోతున్నట్లు టిజిఎస్ఆర్టీసీ ఛైర్మన్ వీసీ సజ్జనార్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. వీసీ సజ్జనార్ సంస్థ భాద్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక సంస్కరణలు చేసి, ఎప్పటికప్పుడు ఇటువంటి విన్నూత్నమైన ఆలోచనలతోటిజిఎస్ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తున్నారు.
దీనిలో కేజీ నుంచి 30 కేజీలకు మించి ఎంత బరువున్న వస్తువులు, సరుకులు నగరంలో ఒక చోట నుంచి మరొక చోటికి పంపించుకోవచ్చు.
హైదరాబాద్ నగరంలో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ కారణంగా, ఒక చోట నివశిస్తున్నవారు మరొక చోట నివశిస్తున్న బంధుమిత్రుల ఇళ్ళకు వెళ్ళి రావడమే చాలా కష్టంగా ఉంటోంది. కనుక నగరంలో తమ ఆత్మీయులకు ఏవైనా వస్తువులు, పచ్చళ్ళు, పిండివంటలు పార్సిల్ చేసి పంపించాలంటే టిజిఎస్ఆర్టీసీ ప్రవేశపెడుతున్న ఈ కొత్త సర్వీసులు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి.
అలాగే నగరంలో వ్యాపార సంస్థలు, పరిశ్రమలకు, కుటీర పరిశ్రమలకు కూడా ఈ సేవలు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. టిజిఎస్ఆర్టీసీ నామ మాత్రపు చార్జీలతో ఈ సేవలు అందిస్తుండటం వలన సామాన్య ప్రజలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.
కేజీ వరకు రూ.30, 1-5 కేజీలకు రూ.60, 5-10 కేజీలకు రూ.65, 10-20 కేజీలకు రూ.70, 20-30 కేజీలకు రూ.75, 30 కేజీలకు పైన రూ.75 చొప్పున ఛార్జీలుగా టిజిఎస్ఆర్టీసీ నిర్ణయించింది.
మరిన్ని వివరాలు, బుకింగ్ కొరకు 90301 34242, 90301 35252 నంబర్లకు ఫోన్ చేయవచ్చు.