సోమవారం నుంచి శంషాబాద్ విమానాశ్రయం కొత్త టెర్మినల్ ప్రారంభం కాబోతోంది. ఆ టెర్మినల్ నుంచి సోమవారం సాయంత్రం 5.30 గంటలకు సౌదీ ఎయిర్ లైన్స్ తొలి విమానం (ఫ్లైట్ నంబర్: ఎస్వి-753) బయలుదేరుతుందని శంషాబాద్ విమానాశ్రయాన్ని నిర్మించి నిర్వహిస్తున్న జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ప్రకటించింది.
కనుక ఇక నుంచి కొత్త టెర్మినల్ నుంచే అంతర్జాతీయ విమానాల రాకపోకలు సాగుతాయని కనుక హైదరాబాద్ నుంచి విదేశాలకు వెళ్ళే అంతర్జాతీయ ప్రయాణికులు సోమవారం నుంచి నేరుగా కొత్త టెర్మినల్కి వెళ్లవలసిందిగా జిఎంఆర్ సంస్థ విజ్ఞప్తి చేసింది.కనుక ఇంతవరకు శంషాబాద్ విమానాశ్రయంలో అంతర్జాతీయ డిపార్చర్స్ కోసం వినియోగిస్తున్న టెర్మినల్ సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి డీకమీషన్ చేయబడుతుందని తెలియజేసింది.
ఇప్పటికే విమానయాన సంస్థలన్నీ కొత్త టెర్మినల్లో తమ కార్యాలయాలు, కౌంటర్స్ ఏర్పాటు చేసుకొన్నాయి. సోమవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లబోయే ప్రయాణికులకు కొత్త టెర్మినల్ నుంచి విషయంలో ఎటువంటి సందేహాలున్నా +91-40-66546370 నంబర్కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని జీఎంఆర్ సంస్థ తెలిపింది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న టెర్మినల్ కంటే మరింత మెరుగైన సౌకర్యాలను కొత్త టెర్మినల్లో కల్పించామని జీఎంఆర్ సంస్థ తెలిపింది.
హైదరాబాద్కు పలు జాతీయ అంతర్జాతీయ కంపెనీలు, పరిశ్రమలు తరలివస్తుండటం, హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. కనుక భవిష్యత్ అవసరాలను, ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని జీఎంఆర్ సంస్థ ఈ కొత్త టెర్మినల్ నిర్మించింది.