అమెజాన్, ఫ్లిప్కార్ట్, జోమోటో, స్వీగ్గీ, మైంత్రా, రిలయన్స్ తదితర ఆన్లైన్ సంస్థలతో పాటు ఇంకా హోటల్స్, రెస్టారెంట్స్ తమ ఉత్పత్తులు, సేవలకు సంబందించి సమీక్ష(రివ్యూ)లు పెడుతుంటాయి. ఓ వస్తువు లేదా బట్టలు లేదా ఆహారపదార్ధాలు ఏవిదంగా ఉన్నాయో ఆ రివ్యూలని చూసి కొనుగోలు చేసేవారు చాలా మందే ఉంటారు. అయితే ఆ రివ్యూలలో చాలా వరకు ఆయా సంస్థ ఉద్యోగులో లేదా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొన్న ఏజన్సీలో వాటిని వ్రాసి పెడుతుంటాయి. వాటి కోసం సదారు సంస్థలు వారికి కొంత సొమ్ము కూడా చెల్లిస్తుంటాయి కనుక వాటిని కంపెనీ అమ్మకాలను పెంచుకొనేందుకు ప్రత్యేకంగా వ్రాసిన ‘పెయిడ్ రివ్యూలు’ అని భావించవచ్చు. వినియోగదారులు అటువంటి పెయిడ్ రివ్యూలను చదివి మోసపోకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
భారతీయ ప్రమాణాల బ్యూరో (బిఐఎస్) ప్రకారం ఈ రివ్యూల ప్రచురణకు తగిన మార్గదర్శకాలను రూపొందిస్తున్నామని త్వరలోనే ప్రకటిస్తామని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ విషయంలో సదరు సంస్థలను పర్యవేక్షించడానికి సర్టిఫికేషన్ కూడా చేస్తున్నామని తెలిపారు.