సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎప్పుడు చూసినా టికెట్ కౌంటర్ల ముందు పెద్ద క్యూలైన్లు కనిపిస్తుంటాయి. కనుక హడావుడిగా వచ్చి టికెట్ కొనుక్కొని రైలు ఎక్కేద్దామనుకొంటే సాధ్యపడదు. కనుక ఈ సమస్య పరిష్కారం కోసం దక్షిణ మద్య రైల్వే శాఖ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో టికెట్ వెండింగ్ మెషిన్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిద్వారా ప్రయాణికులు చాలా సులువుగా స్వయంగా టికెట్స్ కొనుగోలు చేసుకోవచ్చు.
వీటిలో టికెట్ ఎలా కొనుగోలు చేయాలంటే, ముందుగా టికెట్ వెండింగ్ మెషిన్లో కనిపించే ఆప్షన్స్లో మనం ఏ ఊరుకి వెళ్ళాలో ఎంటర్ చేయాలి. తర్వాత పాప్ అప్లో కనిపించే జాబితాలో మనం ఏ రైలులో వెళ్ళదలచుకొన్నామో పేర్కొనాలి. ఆ తర్వాత వెండింగ్ మెషీన్లో కనిపించే క్యూఆర్ కోడ్ని మన స్మార్ట్ ఫోన్లో ఫోన్ పే, గూగుల్ పే వంటి పేమెంట్ యాప్స్ ద్వారా స్కాన్ చేసి పేమెంట్ చేయగానే టికెట్ ప్రింట్ అయ్యి చేతికి వస్తుంది. ఒకవేళ వీటిలో టికెట్ తీసుకోవడం చేతకాకపోతే పక్కనే ఉండే సహాయకుడి ద్వారా టికెట్ కొనుగోలు చేయవచ్చు.