తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా వరంగల్లో గీసుకొండ మండలం హవేలీ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెగా టెక్స్టైల్ పార్కులో కిటెక్స్ గార్మెంట్స్ కంపెనీ రూ.1,200 కోట్లు పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటుచేయబోతోంది. దీనికి రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ నేడు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తదితరులతో కలిసి భూమిపూజ చేశారు.
కిటెక్స్ కంపెనీ ఉత్పత్తి కార్యక్రమాలు మొదలుపెడితే ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి సుమారు 11,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఏడాదిలోగా తొలిదశ నిర్మాణ పనులు పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్లు ఆ కంపెనీ ప్రతినిధులు చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, “వరంగల్ నగరానికి ఇప్పటికే చాలా ఐటి కంపెనీలు వచ్చాయి. అవి తమ కార్యకలాపాలు కూడా ప్రారంభించాయి. త్వరలో మరిన్ని కంపెనీలు రాబోతున్నాయి. అన్ని వస్తే వరంగల్లోనే సుమారు 50 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి,” అని చెప్పారు.