హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ కంపెనీ తయారుచేస్తున్న కోవాక్సిన్ టీకాలు ఇంతవరకు కేంద్రప్రభుత్వం ద్వారా రాష్ట్రాలకు సరఫరా అవుతున్నాయి. అయితే ఆ కంపెనీ ఉత్పత్తి చేసే టీకాలలో 50 శాతం కేంద్రప్రభుత్వానికి ఇచ్చి మిగిలిన 50 శాతం టీకాలను రాష్ట్రాలకు, ప్రైవేట్ ఆసుపత్రులకు అమ్ముకోవచ్చునని కేంద్రప్రభుత్వం అనుమతించింది. కనుక రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోస్ కోవాక్సిన్ రూ. 400 చొప్పున ప్రైవేట్ ఆసుపత్రులకు రూ.1,200 చొప్పున సరఫరా చేస్తామని భారత్ బయోటెక్ కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు భారత్ బయోటెక్ కంపెనీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్ల ఈరోజు ట్విట్టర్ ద్వారా త్వరలోనే తమ కంపెనీ ఢిల్లీతో సహా 14 రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం సూచించిన విదంగా లభ్యతను బట్టి కోవాక్సిన్ డోసులను నేరుగా సరఫరా చేయబోతున్నట్లు ప్రకటించింది.
ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, ఝార్ఖండ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, అస్సాం, జమ్ముకశ్మీర్లకు కోవాక్సిన్ సరఫరా చేస్తామని ప్రకటించారు.