హైదరాబాద్ నగరంలో ప్రముఖ వ్యాపారకేంద్రాలలో బేగం బజార్ కూడా ఒకటి. కనుక ఆ ప్రాంతమంతా నిత్యం ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు వినియోగదారులు, వ్యాపారస్తులతో కిటకిటలాడుతుంటుంది. నగరంలో మళ్ళీ కరోనా తీవ్రత పెరగడంతో బేగం బజార్లోని పలు దుకాణాల యజమానులు, సిబ్బంది కరోనా బారినపడుతున్నారు. కనుక శుక్రవారం నుంచి ప్రతీరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంచాలని నిర్ణయించామని ది హైదరాబాద్ కిరాణా మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ రాఠి, ప్రధాన కార్యదర్శి మహేష్కుమార్ అగర్వాల్ తెలిపారు.
బేగంబజార్, మిట్టికా షేర్, చేపల మార్కెట్, చత్రి తదితర ప్రాంతాలలోని హోల్సేల్ దుకాణాలన్నీ సాయంత్రం 5 గంటలకు మూసివేస్తామని వారు చెప్పారు. దుకాణాలు తెరిచి ఉన్న సమయంలో వ్యాపారస్తులు, సిబ్బందితో సహా వినియోగదారులు కూడా విధిగా మాస్కూలు ధరించాలని, అన్ని దుకాణాల వద్ద తప్పనిసరిగా శానిటైజర్లను అందుబాటులో ఉంచి వినియోగించాలని, భౌతికదూరం పాటించాలని వారు విజ్ఞప్తి చేశారు. మళ్ళీ కొన్ని రోజుల తరువాత కరోనా తీవ్రతపై సమీక్షించి నిర్ణయం తీసుకొంటామని మహేష్కుమార్ అగర్వాల్ చెప్పారు.