హైదరాబాద్లో మళ్ళీ డబుల్ డెక్కర్ బస్సులు తిప్పాలని రాష్ట్ర రవాణాశాఖ నిర్ణయించడంతో టీఎస్ఆర్టీసీ అందుకు సన్నాహాలు ప్రారంభించింది. దీనికోసం టెండర్లు పిలువగా రెండు సంస్థలు మాత్రమే పాల్గొన్నాయి. వాటిలో ప్రముఖ వాహన తయారీ కంపెనీ అశోక్ లేల్యాండ్ కంపెనీ టీఎస్ఆర్టీసీ కోరినవిదంగా బిఎస్-6 ప్రమాణాలు కలిగి, హైదరాబాద్ రోడ్లకు అనుకూలంగా ఉండే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన డబుల్ డెక్కర్ బస్సులు తయారుచేసి ఇవ్వగలమని తెలిపింది. అయితే ఒక్కో బస్సు తయారీకి ఎంత ఖర్చవుతుందో లెక్కగట్టి బస్సు ధరను నిర్ణయించేందుకు మరికొన్ని రోజులు సమయం గడువు కావాలని అశోక్ లేల్యాండ్ కంపెనీ ప్రతినిధులు కోరినట్లు సమాచారం.
హైదరాబాద్ నగరంలో మొత్తం 12 జతల బస్సులను వివిద మార్గాలలో నడిపించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. మరో బస్సును దుర్గం చెరువు కేబిల్ బ్రిడ్జ్ మీదుగా తిప్పాలని భావిస్తోంది. టెండర్లు ఖరారైనప్పటి నుంచి 3-4 నెలల్లో 25 బస్సులు టీఎస్ఆర్టీసీకి అందవచ్చునని అధికారులు భావిస్తున్నారు.