చంద్రయాన్-2 ప్రయోగం చివరి నిమిషంలో విఫలం అవడంతో తీవ్ర నిరుత్సాహం చెందిన ఇస్రో శాస్త్రవేత్తలు మళ్ళీ తేరుకొని మరో ప్రయోగానికి సిద్దం అవుతున్నారు. నవంబర్ 25 ఉదయం 9.28 గంటలకు తమ నమ్మిన బంటు పీఎస్ఎల్వీ సీ47 రాకెట్ ద్వారా ఒకేసారి 14 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. వాటిలో 13 ఉపగ్రహాలు అమెరికాకు చెందినవి కాగా కార్టో శాట్-3 అనే ఒక్కటి మాత్రం భారత్కు చెందినది. కార్టో శాట్-3లో అమర్చిన హై రిసాల్యూషన్ కెమెరాలు భూఉపరితల చిత్రాలను మరింత స్పష్టంగా తీయగలుగుతాయి. ఈ కార్టో శాట్-3 భూమికి 509 కిమీ ఎత్తులో ఉండే కక్ష్యలో ప్రవేశపెట్టబడుతుంది. మిగిలిన 13 అమెరికాకు చెందిన కమర్షియల్ ఉపగ్రహాలని సమాచారం.
అమెరికా వంటి అగ్రదేశం కూడా తన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించేందుకు భారత్ (ఇస్రో) సేవలను వినియోగించుకోవడం విశేషమే. అమెరికా కంటే చాలా తక్కువ వ్యయంతో నూటికి నూరు శాతం విజయవంతంగా ఇస్రో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుండటమే అందుకు ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు.