కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో మంగళవారం ఉదయం డ్రోన్ పంటపొలాలలో కూలిపోయింది. డిఫెన్స్ రీసర్చ్ అండ్ డెవెలప్మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డిఓ) రూపొందించిన రుస్తుం-2 మానవరహిత డ్రోన్ను ఈరోజు ఉదయం చిత్రదుర్గ జిల్లాలోని చల్లకెరే వద్దగల ప్రయోగకేంద్రం నుంచి పరీక్షించి చూస్తుండగా హటాత్తుగా అది సమీపంలోని పంటపొలాలలో కూలిపోయి ముక్కలు ముక్కలయింది. విషయం తెలుసుకున్న చిత్రదుర్గ పోలీసులు అక్కడకు చేరుకొని డ్రోన్ ఫోటోలు తీస్తున్న స్థానికులను వారించి దూరంగా పంపివేశారు. ఇంతలో డిఆర్డిఓ బృందం అక్కడకు చేరుకొని డ్రోన్ శిధిలాలను తీసుకుపోయారు. సాంకేతిక లోపం కారణంగానే డ్రోన్ కూలిపోయుండవచ్చని అనుమానిస్తున్నారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.