కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని లక్ష్మీపూర్లో నిర్మించిన భూగర్భ పంప్హౌస్లో ఏర్పాటు చేసిన బాహుబలి మోటర్లలో 4,5 మోటర్లకు సోమవారం రాత్రి నిర్వహించిన వెట్ ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది. వాటిని ఏర్పాటు చేసిన మేఘా ఇంజనీరింగ్ కంపెనీ ఎండీ శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “వెట్ ట్రయల్ రన్ విజయవంతం అయినందున బుదవారం సిఎం కేసీఆర్ చేతుల మీదుగా వాటి ప్రారంభోత్సవం జరుగుతుందని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇటువంటి మహత్తరమైన ప్రాజెక్టులో పనిచేసే అవకాశం లభించడం నిజంగా తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టులో కెల్లా అత్యంత క్లిష్టమైన, అత్యాధునిక టెక్నాలజీని వినియోగించిన పంప్హౌస్ ఇదేనని తెలిపారు. సిఎం కేసీఆర్ పట్టుదల, సహాయసహకారాల కారణంగానే ఈ ఇంజనీరింగ్ అద్భుతం ఆవిష్కృతమైందని తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద పంప్హౌస్లలో ఇదీ ఒకటిగా నిలుస్తుండి, అని అన్నారు.
ఎత్తిపోతల ప్రాజెక్టులలో 12-15 మీటర్ల ఎత్తువరకు నీటిని ఎత్తిపోయడం సర్వసాధారణమైన విషయమే కానీ ఈ లక్ష్మీపూర్లో ఏర్పాటు చేసిన బాహుబలి మోటార్ పంపులు ఏకంగా 111 మీటర్లు (364 అడుగులు) ఎత్తుకి నీటిని ఎత్తిపోశాయి. రెండు పంపులు కలిపి 6,300 క్యూసెక్కుల నీటిని గ్రావిటీ కెనాల్ ఎత్తిపోస్తుంటే గలగల పారుతున్న ఆ నీళ్ళు నదీ ప్రవాహాన్ని తలపింపజేశాయి.