పాక్, చైనా వంటి శత్రుదేశాల నుంచి నిత్యం సవాళ్ళు ఎదుర్కొంటున్న భారత్ ఎప్పటికప్పుడు తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోకతప్పడం లేదు. ముఖ్యంగా..పాక్ పాలకులు కూడా పాక్ ఉగ్రవాదులకు వంతపాడుతూ భారత్ పై అణ్వాయుధాలతో దాడి చేయడానికి వెనుకాడబోమని బెదిరిస్తునందున, వాటిని ఎదుర్కొనేందుకు భారత్ సంసిద్దంగా ఉండక తప్పదు. ఆ ప్రయత్నాలలో భాగంగానే 5,000 కిమీ దూరంలో గల లక్ష్యాలను చేదించగల అగ్ని-5 క్షిపణిని గురువారం ఉదయం భారత్ విజయవంతంగా పరీక్షించింది. దీనితో అణ్వాయుధాలను కూడా ప్రయోగించవచ్చు.
ఓడిశాలోని అబ్దుల్ కలాం దీవుల నుంచి ఈ ప్రయోగం నిర్వహించినట్లు రక్షణశాఖ తెలిపింది. ఈ పరీక్ష విజయవంతం అయినట్లు రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ కూడా దృవీకరించారు. రక్షణశాఖ ఇప్పటి వరకు నాలుగుసార్లు అగ్ని-5 క్షిపణి ప్రయోగాలు విజయవంతంగా చేసింది. ఈరోజు 5వసారి నిర్వహించిన పరీక్ష కూడా విజయవంతం అవడంతో భారత్ రక్షణ వ్యవస్థ తిరుగులేని శక్తి సంతరించుకొంది.