2013 ఐపిఎల్ సీజన్ లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవితకాల నిషేధానికి గురైన కేరళకు చెందిన క్రికెటర్ శ్రీశాంత్ బిసిసిఐ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేయగా అతని వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం అతనిపై విదించిన నిషేధాన్ని తొలగిస్తున్నట్లు ఆగస్టు 7న తీర్పు చెప్పింది. అప్పటి నుంచి బిసిసిఐ పిలుపు కోసం చకోరపక్షిలాగ ఎదురుచూస్తూనే ఉన్నాడు. అతనికి బిసిసిఐ నుంచి పిలుపు రాలేదు కానీ ఊహించనంత పెద్ద షాక్ తగిలింది.
బిసిసిఐ అతనిపై కేరళ హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది. అతను స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు తమ వద్ద ఆధారాలు బలమైన ఉన్నందునే అతనిపై జీవితకాల నిషేధాన్ని విదించామని, కనుక తమ నిర్ణయాన్ని గౌరవించి అతనిపై విధించిన ఆ నిషేధాన్ని కొనసాగించాలని తన పిటిషన్ ద్వారా న్యాయస్థానాన్ని కోరింది.
ఇది శ్రీశాంత్ ఊహించలేని షాక్ అనే చెప్పవచ్చు. తనపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించగానే ఎప్పటికైనా భారత్ తరపున వరల్డ్ కప్ లో ఆడాలనేదే తన ధ్యేయమని చెప్పారు. కానీ బిసిసిఐ వేసిన ఈ పిటిషన్ చూస్తే అతనిని జీవితకాలంలో మళ్ళీ క్రికెట్ మైదానంలో అడుగుపెట్టనీయకూడదనే అభిప్రాయం ఉన్నట్లు అర్ధం అవుతోంది. కనుక శ్రీశాంత్ మళ్ళీ సుదీర్ఘమైన న్యాయపోరాటం మొదలుపెట్టక తప్పదు. అంత ఓపిక లేదనుకొంటే భాజపా ఎలాగూ ఆహ్వానిస్తోంది కనుక దానిలో చేరిపోయి రాజకీయాలలోకి వచ్చేయవచ్చు.