ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, మూడు 20-20, మూడు టెస్ట్ మ్యాచ్లు ఆడుతోంది. వాటిలో ఇప్పటికే మూడు వన్డేలు, 20-20 మ్యాచ్లు జరిగాయి. మూడు వన్డేల సిరీస్ను ఆస్ట్రేలియా జట్టు కైవసం చేసుకోగా, 20-20 మ్యాచ్ సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. ఇదిలా ఉండగా మొదటి టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో భారత అత్యల్ప స్కోరు 36 పరుగులు చేసింది. 1973లో జరిగిన మ్యా చ్లో అత్యల్ప స్కోరు 43 చేయగా ఈసారి అంతకంటే దారుణంగా కేవలం 10 పరుగులు తక్కువ చేసింది.
ఇదిలా ఉండగా డిసెంబర్ 26 నుండి రెండవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. దీని బాక్సింగ్-డే టెస్టు మ్యాచ్గా పిలుస్తారు. మొదటి మ్యాచ్లో చతికిలపడ్డ భారత జట్టు ఎలాగైనా ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టుకు గట్టి పోటీనివ్వాలని అభిమానులు కోరుకొంటున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ పరంగానూ ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మంచి పట్టు మీద ఉంది.
ఇక భారత జట్టు విషయానికి వస్తే జట్టును గాయాల సమస్య వెంటాడుతోంది. ఇటీవల జరిగిన టెస్ట్ మ్యాచ్లో బౌలర్ మహ్మద్ షమీ గాయాలపాలయ్యాడు. రేపు జరగబోయే మ్యాచ్లో అతడు ఆడతాడా లేదా అన్నది అనుమానమే. ఇప్పటివరకు టీం కెప్టెన్గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. అతని భార్య అనుష్క శర్మ జనవరి మొదటివారంలో బిడ్డను ప్రసవించబోతోంది. కనుక విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా టూర్ నుంచి మద్యలో నిష్క్రమించి మంగళవారం భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. కనుక రేపు జరగబోయే మ్యాచ్కు కెప్టెన్గా అజింక్యా రహనే వ్యవహరించనున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్లో ఆస్ట్రేలియా జట్టు 0-1తో ముందు ఉంది. కనుక 0-1తో విరాట్ కోహ్లీ స్థానంలో కెప్టెన్గా బాధ్యత స్వీకరించిన రహనేకు, భారత జట్టుకు కూడా రేపు జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్ అగ్నిపరీక్ష కానుంది.