తెలంగాణా సర్కార్ భారత మహిళా క్రికెటర్ మిథాలి రాజ్ కు కోటి రూపాయలు నగదు, హైదరాబాద్ నగరంలో 600 గజాల ఇంటి స్థలం బహుమతిగా ఇచ్చింది. ఈ ఏడాది ప్రపంచ మహిళల వరల్డ్ కప్ క్రికెట్ పోటీలలో ఆమె నేతృత్వంలో భారత్ టీమ్ ఫైనల్స్ వరకు చేరుకొన్న సంగతి తెలిసిందే. ఆమె వన్డే మ్యాచ్ లలో 6,000 రన్స్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది కూడా. అందుకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి పద్మారావు ఆమెకు కోటి రూపాయలకు చెక్, ఇంటి స్థలం పత్రాలు అందజేశారు. ఆమెకు శిక్షణ ఇచ్చి ఇంతగా రాణించడానికి కారకుడైన ఆమె కోచ్ ఆర్.ఎస్.ఆర్.మూర్తికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.25 లక్షలకు చెక్ ను బహుమతిగా మంత్రి అందజేశారు.