సాధారణంగా విదేశాలలో స్థిరపడిన భారతీయులు చక్కగా పని చేస్తూ, అక్కడి చట్టాలను గౌరవిస్తూ ఒద్దికగా జీవిస్తూ మంచిపేరు కలిగి ఉంటారు. కానీ కాలిఫోర్నియా రాష్ట్రంలోని ప్రెస్నో అనే నగరంలో ఒక గ్రాసరీ స్టోర్ లో నిన్న దోపిడీకి పాల్పడిన ముఠాలో అధవాల్ (22) అనే భారతీయుడు పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ దోపిడీముఠా గ్రాసరీ స్టోర్ ను దోచుకొన్న తరువాత, పక్కనే ఉన్న పెట్రోల్ బంకును కూడా దోచుకొన్నారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన ధరమ్ ప్రీత్ సింగ్ జస్సేర్ (21) అనే భారత విద్యార్ధి వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా అతనిపై కూడా వారు కాల్పులు జరుపడంతో అతను అక్కడే మరణించాడు. అమెరికాలో ఇటువంటి దోపిడీ సంఘటనలు జరగడం సాధారణమైన విషయమే కానీ ఆ దోపిడీ ముఠాలో ఒక భారతీయుడు కూడా ఉండటమే చాలా విస్మయం కలిగిస్తోంది. పోలీసులకు పట్టుబడిన అధవాల్ అనే ఆ భారతీయుడు నిజంగా దోపిడీ ముఠాలో ఉన్నాడా లేక ఆ సమయంలో అక్కడ ఉన్నందున పోలీసులు పొరపాటున అరెస్ట్ చేశారా? అనే విషయం తెలియవలసి ఉంది. అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో చదువు లేదా ఉద్యోగాల కోసం వెళ్ళాలంటే అనేక వ్యయప్రయాసలు తప్పవు. అంత కష్టపడి అక్కడకు చేరుకొని, ఇటువంటి సంఘ, చట్ట వ్యతిరేక పనులకు పూనుకోవడం నిజమైతే అది చాలా ఆశ్చర్యకరమైన విషయమే.