హైదరాబాద్ చంచల్ గూడాకు చెందిన మహ్మద్ ఆరీఫ్ మొయినుద్దీన్ (37) అనే వ్యక్తిని అమెరికాలో దారుణహత్యకు గురయ్యాడు. ఆయన గత పదేళ్ళుగా జార్జియాలో ఓ కిరాణా షాప్ నడిపించుకొంటూ ఒంటరిగా ఉంటున్నారు. జార్జియా పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం ఆరీఫ్ ఉంటున్న ఇంటికి సమీపంలోనే కొంతమంది దుండగులు ఆయనపై కత్తులతో దాడిచేసి పారిపోయారు. తీవ్రగాయాల పాలైన ఆరీఫ్ను పోలీసులు ఆసుపత్రికి తరలించేలోగానే చనిపోయాడు. ఆ విషయాన్ని వారు ఆరీఫ్ భార్య మెహ్నాజ్ ఫాతిమాకు ఫోన్ ద్వారా తెలియజేయడంతో ఆమె చాలా షాక్ అయ్యారు.
భారత్ కాలమాన ప్రకారం ఆదివారం ఉదయం 9.00 గంటలకు అతనితో ఫోన్లో మాట్లాడనని, మళ్ళీ అరగంటలో నేనే నీకు ఫోన్ చేస్తానని ఆరీఫ్ చెప్పాడని ఆమె తెలిపింది. కానీ అంతలోనే ఈ దుర్వార్త వినవలసి వచ్చిందని ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తన భర్తకు అమెరికాలో తెలిసినవారు, బంధువులు ఎవరూ లేనందున ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు తనకు, తన తండ్రికి అత్యవసరంగా అమెరికా వీసాలు ఇప్పించవలసిందిగా మజ్లీస్ బచావో తెహ్రీక్ ప్రతినిధి మహ్మద్ ఉల్లాఖాన్ ద్వారా విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్కు విజ్ఞప్తి చేయగా ఆయన వెంటనే స్పందించి వారిరువురికీ అమెరికన్ వీసాలు ఏర్పాటు చేస్తున్నారు.