అమెరికా అధ్యక్ష పదవికి మళ్ళీ పోటీ పడుతున్న డోనాల్డ్ ట్రంప్, ఆయన ప్రత్యర్ధి జో బిడెన్ల మద్య ఈనెల 15న జరుగవలసిన ముఖాముఖీ చర్చ రద్దు చేసినట్లు కమీషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్ (సిపిడి) ప్రకటించింది. జో బిడెన్తో ముఖాముఖీ చర్చకు సిద్దంగా ఉన్నానని డోనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ ఇటీవల కరోనా సోకి చికిత్స పొంది కోలుకొన్న ఆయనతో ముఖాముఖీ చర్చలో పాల్గొనదలచుకోలేదని జో బిడెన్ చెప్పడంతో వారి చర్చా కార్యక్రమం రద్దు అయ్యింది. వర్చువల్ పద్దతిలో వారి మద్య చర్చా కార్యక్రమంలో నిర్వహించడానికి సిపిడి ముందుకు వచ్చినప్పటికీ వారిరువురూ అంగీకరించకపోవడంతో అక్టోబర్ 15న జరుగవలసిన వారి చర్చా కార్యక్రమం పూర్తిగా రద్దు అయినట్లు సిపిడి ప్రకటించింది.
అయితే అక్టోబర్ 22న జరుగవలసిన మూడవ మరియు చిట్టచివరి ముఖాముఖీ చర్చకు ఇరువురూ అంగీకరించడంతో సిపిడి అందుకు ఏర్పాట్లు చేస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్ధులు పోలింగ్ జరిగేలోగా వరుసగా మూడుసార్లు మీడియా సమక్షంలో ముఖాముఖీ చర్చలలో పాల్గొని తమ విధివిధానాలను సమర్ధించుకొంటూ, ప్రత్యర్ధి పార్టీ విధానాలలో లోపాలను ఎత్తిచూపుతూ మాట్లాడవలసి ఉంటుంది. దశాబ్ధాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. ఈ మూడు చర్చలలో వారి తీరు, వారు మాట్లాడిన తీరు, వారి విధివిధానాలను బట్టి అమెరికన్ ప్రజలు వారిరువురిలో తమకు నచ్చిన అభ్యర్ధులకు ఓట్లు వేస్తుంటారు.