అగ్రరాజ్యమైన అమెరికా కరోనా మహమ్మారిని మొదట్లో నిర్లక్ష్యం వహించినందుకు ఇప్పుడు చాలా భారీ మూల్యం చెల్లిస్తోంది. అమెరికాలో ఆదివారం ఒక్కరోజే 630 మంది కరోనాతో చనిపోయారు. ఇప్పటివరకు 8,162మంది కరోనాకు బలైయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఈనెలాఖరు వరకు లాక్డౌన్ ప్రకటించినప్పటికీ కరోనా వైరస్ బారినపడుతున్నవారి సంఖ్య నానాటికీ అనూహ్యంగా పెరిగిపోతోంది. తాజా సమాచారం ప్రకారం అమెరికాలో 3,12,146 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా పాజిటివ్ కేసులు శరవేగంగా పెరిగిపోతుండటంతో రోగులకు చికిత్స అందించేందుకు ఆసుపత్రులు సరిపోవడం లేదు. వెంటిలేటర్లు, వైద్య సిబ్బందికి అత్యవసరమన రక్షణ దుస్తులకు కూడా ఇబ్బందిపడే పరిస్థితులు నెలకొన్నాయి.
దీనికంతటికి ప్రధాన కారణం అమెరికాలో స్థిరపడిన వేలాదిమంది చైనా దేశస్థులు, తమ దేశంలో కరోనా వైరస్ వ్యాపించిన తరువాత వూహాన్తో పలు రాష్ట్రాలకు వెళ్ళి అమెరికాకు తిరిగివచ్చారు. కానీ ట్రంప్ ప్రభుత్వం కరోనా తీవ్రతను, దాని విపరీతపరిణామాలను గుర్తించడంలో తీవ్ర అలసత్వం వహించింది. అందుకే నేడు దేశంలో ఈ దుస్థితి ఏర్పడిందని సర్వత్రా అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కనీసం ఇప్పటికైనా అమెరికా ప్రభుత్వం కరోనాను అదుపు చేయలేకపోతే రాగల వారం పదిరోజులలో అమెరికా పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనని అందరూ ఆందోళన చెందుతున్నారు.
అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తుండటంతో అక్కడ స్థిరపడిన లక్షలాదిమంది ప్రవాస భారతీయులు భయంభయంగా గడుపుతున్నారు. భారత్లో వారి తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు, బందుమిత్రులు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు.