సీఏఏ వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయ సమస్యగా మారుతోంది. దీనిని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై జరుగుతున్న విచారణలో ఐక్యరాజ్య సమితి మానవహక్కుల సంఘాన్ని కూడా అనుమతించాలని కోరుతూ దాని కమీషనర్ మైకేల్ బాచెలెట్ జరియా కోరినట్లు జెనీవాలోని భారత్ దౌత్యకార్యాలయం తెలిపింది. సీఏఏ చాలా మంచి ఉద్దేశ్యంతోనే తెచ్చినప్పటికీ దాని వలన భారత్లో కోట్లాదిమంది ప్రభావితమవుతారు కనుక అది మానవ హక్కుల పరిధిలోకి వస్తుందని, కనుక ఈ కేసుల విచారణలో సుప్రీంకోర్టుకు సహాయకునిగా తమను అనుమతించవలసిందిగా కోరుతూ మైకేల్ బాచెలెట్ జరియా ఓ లేఖ అందజేసినట్లు భారత్ దౌత్యకార్యాలయం తెలిపింది.
కానీ ఇది భారత్ అంతర్గత వ్యవహారమని దీనిలో విదేశీయులు, విదేశీ సంస్థల జోక్యం చేసుకోవడాన్ని అనుమతించబోమని భారత ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘానికి వెంటనే తెలియజేసింది. భారత్ అవసరాలు, ప్రయోజనాల కోసం పార్లమెంటు చేసిన చట్టాలలో విదేశీసంస్థలు జోక్యం చేసుకోవడం భారత్ సార్వభౌమత్వ హక్కులను ప్రశ్నించడమే అవుతుంది కనుక అనుమతించబోమని తెలియజేశామని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రవీశ్కుమార్ చెప్పారు.