ఆస్ట్రేలియాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. కేరళకు చెందిన అల్బిన్ టీ మాథ్యూస్(30), నిను సుసెన్ ఏల్ధో(28) నవదంపతులు న్యూ సౌత్వేల్స్ నగరంలో కారులో ప్రయాణిస్తుండగా కారులో మంటలు చెలరేగాయి. కానీ ఇద్దరూ కారులోనుంచి బయటపడలేక చిక్కుకుపోవడంతో సజీవదహనం అయ్యారు. వారి కారు నెంబరు, ఘటనాస్థలంలో లభించిన ఇతర ఆధారాలతో ఆమెను నిను సుసేన్ ఎల్ధో(28)గా ఆస్ట్రేలియా పోలీసులు గుర్తించారు. ఆమె న్యూ సౌత్వేల్స్ ఒక ప్రముఖ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నట్లు కనుగొన్నారు. అక్కడకు వెళ్ళి వాకబు చేయగా వారి గురించి పూర్తి వివరాలు లభించాయి.
వారిరువురూ కేరళకు చెందినవారు. ఇరువురి తల్లితండ్రులు కేరళలో నివాసం ఉంటున్నారు. అల్బిన్, నిను సుసేన్లకు ఈ ఏడాది అక్టోబర్ 28న అంగరంగ వైభవంగా పెళ్ళి జరిగింది. చూడముచ్చటైన ఆ జంటను చిరకాలం చిలకాగోరింకల్లా సుఖంగా జీవించాలని అందరూ ఆశీర్వదించారు. కానీ వారి దీవెనలు, ప్రార్ధనలు ఏవీ ఫలించలేదు. పెళ్ళై రెండు నెలలు పూర్తికాకమునుపే ఇద్దరూ మృత్యువాత పడ్డారు.
వారిరువురూ గత నెల 20న ఆస్ట్రేలియా వెళ్లారు. అక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిసి ఇరు కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి. కానీ అంతలోనే ఈ విషాదకరవార్త విని అందరూ దిగ్భ్రాంతి చెందారు. ఇరు కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.