భారత్-అమెరికా దేశాల మద్య వాణిజ్య సంబంధాలు వివాదాస్పదంగా మారుతుండటం, డేటాను స్థానికంగానే భద్రపరచాలనే భారత ప్రభుత్వ నిర్ణయం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అధ్యక్ష ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించడం వంటి అనేక పరిణామాల నేపద్యంలో ఏటా భారత్కు కేటాయిస్తున్న హెచ్-1బీ వీసాలలో 15 శాతం కోత విధించాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం ఏడాదికి 85,000 హెచ్-1బీ వీసాలు జారీ చేస్తోంది. వాటిలో దాదాపు 70 శాతం వీసాలను భారత్ దక్కించుకొంటోంది. అంటే 59,500 వీసాలన్న మాట. వాటిలో ఇప్పుడు 15 శాతం కోత విధించినట్లయితే సుమారు 9,000 వీసాలు తగ్గిపోతాయి. ఆ వీసాలపై అమెరికాలో ఉద్యోగాలు సంపాదించుకుంటున్నవారికి, ఆ వీసాలతో అమెరికాలో కంపెనీలకు సేవలందిస్తున్న భారతీయ కంపెనీలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడవచ్చు. యుఎస్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ మైక్ పొంపియో త్వరలో భారత్ పర్యటనకు రానున్నారు. ఆయన పర్యటనకు ముందుగా ట్రంప్ సర్కార్ ఇటువంటి ఆలోచన చేస్తున్నట్లు భారత్ చెవిలో వేయడం హెచ్చరికగానే భావించవలసి ఉంటుంది. దీనిపై భారత్ ఇంకా స్పందించవలసి ఉంది.