అమెరికాలో తెలుగు టెకీ కూచిభొట్ల శ్రీనివాస్ (32)ను కాల్చి చంపిన ఆడమ్ ప్యూరింటన్ కు స్థానిక జాన్సన్ కౌంటీ డిస్ట్రిక్ట్ కోర్టు మూడు యావజ్జీవ కారాగార శిక్షలు విధించింది. ఆ మూడు శిక్షలను ఒకదాని తరువాత మరొకటి అనుభవించాలని తీర్పు చెప్పింది. అంటే ఇక అతను జీవించి ఉన్నంత కాలం జైలులోనే గడపాల్సి ఉంటుందన్నమాట. తాను జాతి విద్వేషంతోనే కూచిభొట్లపై కాల్పులు జరిపి హత్య చేసినట్లు అతను అంగీకరించడంతో న్యాయస్థానం ఈ శిక్షలు ఖరారు చేసింది. కూచిభొట్ల శ్రీనివాస్ అతని ఇద్దరు స్నేహితులతో కలిసి 2017 ఫిబ్రవరిలో కాన్సాస్ లోని ఒక బార్ లో ఉన్నప్పుడు ఆడమ్ ప్యూరింటన్ వారిని అమెరికా విడిచి వెళ్ళిపోవాలని హెచ్చరిస్తూ కాల్పులు జరిపాడు. అతని కాల్పులలో కూచిభొట్ల శ్రీనివాస్ తీవ్రంగా గాయపడి చనిపోయాడు.