ప్రతీ మనిషి జీవితంలో ఊహించలేని ఘటనలు జరుగుతుంటాయి. అమెరికా వెళ్ళి ఉన్నత చదువులు చదువుకొని పెద్ద ఉద్యోగంలో స్థిరపడతాడనుకొన్నవ్యక్తి తన జీవితంలో ఎన్నడూ చూడని ఒక వ్యక్తి చేతిలో చనిపోతాడని ఎవరు మాత్రం ఊహించగలరు? అమెరికాలో ఎంఎస్ చదువుకొంటున్న శరత్ పై శుక్రవారం రాత్రి ఒక నల్లజాతీయుడు కాల్పులు జరపడంతో చనిపోయాడు. ఈ విషయం తెలిసి హైదరాబాద్ లో ఉంటున్న అతని తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తెలంగాణా ప్రభుత్వం, విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు చొరవతో శరత్ మృతదేహం బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకొంది. నిండు నూరేళ్ళు సాగవలసిన జీవితం అర్దాంతరంగా ముగిసిపోవడం చాలా బాధాకరమే. చెట్టంత కొడుకును పోగొట్టుకొన్న ఆ తల్లితండ్రుల శోకాన్ని ఎవరు మాత్రం తీర్చగలరు?గురువారం మధ్యాహ్నం శరత్ కు అతని కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.